బీజేపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్.. కండువా కప్పి ఆహ్వానించిన జేపీ నడ్డా!

  • ఢిల్లీలో బీజేపీలో చేరిన అన్నం సతీశ్
  • సాదరంగా ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా
  • టీడీపీని వీడేముందు లోకేశ్ పై తీవ్ర విమర్శలు
తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా సమర్పించిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సతీశ్ కు బీజేపీ కండువా కప్పిన నడ్డా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అన్నం సతీశ్ 2014లో బాపట్ల నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు.

అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సతీశ్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం నేపథ్యంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ పై సతీశ్ ఘాటు విమర్శలు చేయడం కలకలం రేపింది. లోకేశ్ వల్లే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని సతీశ్ వ్యాఖ్యానించారు. పార్టీపై, దాని సంస్థాగత నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకపోయినా దాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
annam satish
Nara Lokesh
BJP
joined
jp nadda

More Telugu News